సమాజధర్మాల్ని మనిషి నిర్ణయిస్తే,
శరీరధర్మాల్ని ప్రకృతి నిర్ణయించింది.
ప్రకృతి సంకల్పానికి ఎదురీదటం సాధ్యమా?
అయినా బుధ్ధి మనసుని ప్రతిఘటించింది,
మనస్పూర్తిగా ప్రతిఘటించిందా? సందేహమే?
నిగ్రహం ఆవేశంతో తలపడే కొన్ని క్షణాల్లో…
ఓటమి విజయాన్ని మించిన ఆనందాన్నిస్తుంది!
అందుకనే విజయాన్ని కాదని ఓటమిని అక్కున చేర్చుకున్నామేమో
రాజు లొంగిపోయాక రాజ్యంలాగే… మనసు లొంగిపోయాక తనువూ.
నీటిలోకి రాయి విసిరినంత నిర్లక్ష్యంగానే…
ఓరకంటి చూపు విసిరావు…
రాయి అలజడి రేపింది,
చూపు కలవరం రేపింది–
మానససరోవరంలో నిశ్శబ్దంగానే మౌనభంగం జరిగింది!
నిశ్శబ్దం మౌనమేనా… నీకళ్ళు నా కళ్ళకు బదులివ్వలేదా?
వెలుగుచినుకుల వాన కితకితలెడితే గోదారి తైతెక్కలాడలేదా?
చేయందించి నువ్వు పడవలోకి లాగావా, చేతినందుకుని నేను లోపలికొచ్చానా?
మబ్బు చాటునుంచి చూసిన చందమామ నడగాలి!
పండు వెన్నెలా, గండు కోయిలా,
వరద గోదారీ, వెలుగు రాదారీ,
వానవిల్లూ, వెన్నెల సెలయేరూ…
అన్నీ ఒక్క సారే… ఒక్క చోటే…
పోటెత్తిన సంద్రం ఒడ్డుని ముంచెత్తినట్టు,
అవధుల్లేని ఆనందం ఆత్మను ముంచెత్తినపుడు…
ఆనందం చైతన్యాన్నీ, అంతరంగాన్నీ దాటి ప్రాణాన్ని మృదువుగా స్పృశించినపుడు…
ఆ జ్ఙాపకం సైతం ఆనందమై అద్వైతాన్ని ఆవిష్కరించదా?
నువు లేని క్షణంలోనూ నీ ఉనికిని ప్రకటించదా…?